-దసరా సందర్భంగా నోటిఫికేషన్
- టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ
- కొత్త ఏడాదిలో నూతన టీచర్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే సాంకేతిక ఉద్యోగాలు, శాంతిభద్రతల విభాగంలోని ఖాళీలు, అనంతరం గ్రూప్ -2 క్యాటగిరీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర సర్కారు, తాజాగా ఉపాధ్యాయ కొలువుల భర్తీని చేపడుతున్నది. దసరా పండుగ కానుకగా పదివేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణలో విద్యాప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని సీఎం కే చంద్రశేఖర్రావు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మొదలు ఉపాధ్యాయ సంఘాల వరకు వివిధ వర్గాలతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఇటీవలే గురుకుల విద్యాలయాల్లో ఐదువేలకు పైగా ఉద్యోగ,ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఉపాధ్యాయ కొలువుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచారం కోరింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సచివాలయంలో సమావేశమై కొలువుల భర్తీపై చర్చించారు. ప్రస్తుతం ఖాళీ అయినవి, వివిధ రూపాల్లో త్వరలో ఖాళీ కానున్నవి కలిపి సుమారు పదివేల పోస్టులు ఉన్నాయని గుర్తించారు. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ ప్రమాణపత్రం దాఖలు చేశారు. నోటిఫికేషన్ సమయంలోగా ఉమ్మడి సర్వీస్ రూల్స్, పదవీ విరమణ చేయడం ద్వారా ఏర్పడే ఖాళీలు, వాస్తవ ఖాళీలు వంటివి స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు.
1937







