Wednesday, 31 August 2016

జీఎస్‌టీ బిల్లుకు గోవా కూడా ఓకే... 50 శాతం రాష్ట్రాల మ‌ద్ద‌తు వ‌చ్చేసింది!


Wed, Aug 31, 2016, 06:53 PM
దేశవాప్తంగా ఒకే పన్ను వ్యవస్థను నెలకొల్పటానికి ఉద్దేశించిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు ఎన్నో అడ్డంకులను దాటుకొని రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన సంగ‌తి తెలిసిందే. బిల్లుకి దేశంలోని క‌నీసం 15 రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల నుంచి ఆమోదం రావాల్సి ఉండ‌గా.. నేడు గోవా శాస‌న‌స‌భ బిల్లుని ఆమోదించ‌డంతో జీఎస్‌టీ బిల్లుని ఆమోదించిన రాష్ట్రాల సంఖ్య 15కు చేరుకుంది. దీంతో దేశంలోని 50 శాతం రాష్ట్రాల మ‌ద్ద‌తు వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా గోవా ముఖ్య‌మంత్రి ప‌ర్సేక‌ర్ మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులకు ధ‌న్యావాదాలు చెప్పారు. 

జీఎస్‌టీ స‌వ‌ర‌ణ‌ బిల్లు అమల్లోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. దీంతో గోవాకి మరింత ఆదాయం వ‌స్తుంద‌ని చెప్పారు. బిల్లుని ఆమోదించిన 15వ రాష్ట్రంగా తమ రాష్ట్ర‌మే నిల‌వ‌డం గొప్ప విషయమని ఆయ‌న వ్యాఖ్యానించారు. జీఎస్‌టీ బిల్లుని ఆమోదించిన మొద‌టి రాష్ట్రంగా ఈనెల 12న అసోం నిలిచిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత బీహార్ ఈ బిల్లుని ఆమోదించి జీఎస్‌టీని ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేతర రాష్ట్రంగా నిలిచింది. 

ఆ త‌రువాత జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, నాగాలాండ్‌, మహారాష్ట్ర, హరియాణా, తెలంగాణ, సిక్కిం, మిజోరం రాష్ట్రాలు రోజుల వ్య‌వ‌ధిలోనే బిల్లుని ఆమోదించాయి. ఈరోజు గోవా జీఎస్‌టీని ఆమోదించి ఆ పరంపరలో 15వ రాష్ట్రంగా నిలిచింది. వ‌చ్చే ఏడాది ఆర్థిక సంవత్స‌రం ప్రారంభం నుంచే (ఏప్రిల్ 1) కేంద్రం ఈ బిల్లుని అమ‌లులోకి తీసుకురానుంది.

0 comments:

Post a Comment