Monday, 22 August 2016


  • హైదరాబాద్‌ మినహా 9 జిల్లాల పునర్వ్యవస్థీకరణ
  • కొత్తగా 17 జిల్లాలు, 15 డివిజన్లు, 46 మండలాలు
  • ప్రాథమిక నోటిఫికేషన విడుదల చేసిన ప్రభుత్వం
  • సెప్టెంబరు 20 వరకూ అభ్యంతరాల స్వీకరణ
  • కలెక్టరేట్‌, సీసీఎల్‌ఏ, సచివాలయంలో ఇవ్వవచ్చు
  • అక్టోబరు రెండో వారంలో తుది నోటిఫికేషన్‌
  • ఇవే తుది ప్రతిపాదనలు కావు: మహమూద్‌ అలీ
హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): 27 జిల్లాలు..! 60 రెవెన్యూ డివిజన్లు..! 505 మండలాలు..! తెలంగాణ రాష్ట్ర తాజా స్వరూపమిది! పది జిల్లాల తెలంగాణకు కొత్తగా మరో 17 జిల్లాలు జత కూడాయి. వాటితోపాటే మరో 15 రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలు కొత్తగా కలిశాయి. ఈ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొమ్మిది జిల్లాలకూ తొమ్మిది వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
 
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీ్‌పచంద్ర సోమవారం జీవో నెం. 361-369 జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ముసాయిదాపై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలను తెలపడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల వివరాలను http://newdistrictsformation.telan-gana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సెప్టెంబరు 20 దాకా అభ్యంతరాల స్వీకరణ, 15 రోజులపాటు వాటి పరిశీలన, అక్టోబరు రెండో వారంలో ఫైనల్‌ నోటిఫికేషన విడుదల చేయనున్నారు. అనంతరం, సచివాలయంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నోటిఫికేషనను విడుదల చేశారు.
 
నెల రోజులు అభ్యంతరాలు 
పది జిల్లాల తెలంగాణలో కొత్తగా మరో 17 జిల్లాలు, 15 డివిజన్లు, 46 మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ తెలిపారు. వీటిపై నెల రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత 15 రోజులపాటు వాటిని పరిశీలించి, తుది నోటిఫికేషన ఇస్తామని ప్రకటించారు. అభ్యంతరాలు, సూచన సలహాలను సచివాలయంతోపాటు సీసీఎల్‌ఏ, ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టరేట్లలోనూ సమర్పించవచ్చని తెలిపారు.
 
జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఇదే తుది నోటిఫికేషన్‌ కాదని, మరో రెండుసార్లు అఖిలపక్షం నిర్వహించి, ప్రజల అభ్యంతరాలు/అభిప్రాయాల మేరకు ఫైనల్‌ నోటిఫికేషన ఉంటుందని వివరించారు. 14 ఏళ్ల పోరాటంలో ప్రజలు చేసిన విజ్ఞప్తితో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ‘‘నిజాం హయాంలో 9 జిల్లాలు ఉండేవి. గత ఆరు దశాబ్దాల్లో రంగారెడ్డి ఒక్కటే కొత్తగా ఏర్పడింది. మాకూ జిల్లా కావాలనేది ప్రజల చిరకాల డిమాండ్‌. ప్రజల కోసమే జిల్లాలు ఏర్పాటు చేశాం.
 
నాయకులు, రాజకీయ పార్టీల కోసం కాదు’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతిపాదిత జిల్లాలు, మండలాల మ్యాపులను మంగళవారం సాయంత్రానికల్లా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసామని సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌ తెలిపారు. అభ్యంతరాలు/విజ్ఙప్తులను కూడా వెబ్‌సైట్‌లో నేరుగా సమర్పించవచ్చన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో గెజిట్‌ నోటిఫికేషన విడుదల చేస్తామని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర ప్రకటించారు.
 

0 comments:

Post a Comment